కైక కోరికపై వనవాసం చేయటానికి వెళ్తున్న శ్రీరామునకై యంతఃపురస్త్రీలు దుఃఖించుట |
కం. మ్రొక్కుచుఁ దల్లికిఁ దండ్రికి,నక్కరణిని రామచంద్రుఁ డరిగిన నాపై నొక్కమొగి నంతిపురమున, మిక్కుటమై యార్తరవము మింటికి నెగసెన్. ప్రస్తుతము శ్రీరామప్రజల వృత్తాంతము చెప్పుటచాలించి యీలోపల నంతఃపురమున జరిగిన వృత్తాంతమును గవి చెప్పుచున్నాడు.ముందు చెప్పిన విధముగా శ్రీరాముఁ డందఱు తల్లులకుఁ దండ్రికి నమస్కరించి రథమెక్కి పయనమై పోఁగా నంతఃపురమున మిక్కిలి యధికమైన యేడుపుధ్వని యాకాసమున కెగసెను. కం. గతి యెవ్వఁ డనాథులకున్, గతి యెవ్వఁడు దుర్బలులకుఁ గడుఁ దపసులకున్ గతి యెవఁడు శరణ మెవఁడా, పతి గతిచెడి యెచటి కేగువాఁడో యకటా.పోతనగారి బాణీ స్పష్టంగానే కనిపిస్తున్నది. దిక్కులేనివారికిని బలములేనివారికిని నెవఁడు పొందఁదగివనవాఁడో తపస్సు చేసికొనువారికిఁ బ్రాపింపఁ దగినవాఁడు రక్షకుఁడు నెవఁడో యట్లందఱకు రక్షకుఁడు ప్రాప్యుఁడైనవాఁడు ప్రాపురక్షకుఁడు లేక యయ్యో యెక్కడఁ బోవుచున్నాఁడో. సీ. తనమీఁద నెవరైనఁ దంట లాడిన నైనఁ , గోపంబు చెందఁడే కొమ్మలార ! యేమి చేసిన నది యెవరి నొప్పించునో, యని జంకుచుండునే యమ్మలార ! యెవ్వరేనియుఁ గింక నొ వ్వొంద వారల, నూఱట లాడునే యువిదలార ! పరసుఖదుఃఖముల్ స్వసుఖదుఃఖము లట్లు , పరికించు చుండునే తరుణులార ! తే. కన్న తల్లిని గౌసల్యఁ గన్న పగిది మనల నందఱఁ జూచునే మగువలార ! యట్టి పుణ్యాత్ముఁ డటువంటి యనఘు చరితుఁ డెచట నున్నాఁడొ కటకటా యెందు జనునొ. 1124 తనమీద నెవరైనను గొండెములు చెప్పినను గోపింపఁడు. తానుజేయు కార్య మెవరి మనమునకైన నొప్పి కలిగించునో యనిసందేహించి యట్లెవరి మనసు నొవ్వని కార్యములే చేయుచుండును. తనమీఁద నెవరైన గోపించి నొప్పి చెందినను వారలను సమాధానపఱుచును. ఇతరుల సుఖము తనసుఖముగను ఇతరుల దుఃఖము తన దుఃఖముగను జూచుచుండును. కన్నతల్లిని గౌసల్య నేవిధముగఁ జూచునో యట్టులే మనలనందఱఁ జూచును. అటువంటి పుణ్యాత్ముఁడు అటువంటి నిర్దుష్ట చరిత్రుఁడు ఎందున్నాఁడో - యెందు బోవుఁచున్నాఁడో , ఈలాంటి ఎన్నో అందమైన పద్యాలతోనూ, అర్థ తాత్పర్య వాఖ్యానాలతోనూ సాగిపోతుంటుంది వాసుదాసు ( వావిలికొలను సుబ్బారావు ) గారి సుందరమైన మందర వ్యాఖ్యానము. అందఱూ తప్పక చదవాల్సిన మంచి పుస్తకం. |
Showing posts with label శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము. Show all posts
Showing posts with label శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము. Show all posts
Apr 9, 2010
శ్రీరాముని సద్గుణాలు ( మందరం నుంచి )
Posted by
Unknown
1 comments
Feb 13, 2010
జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్
రామాయణ రస గుళికలు ( శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము - వావిలికొలనుసుబ్బారావు గారు ) అయోధ్యాపుర జన వర్ణనము ఉ. అందఱు హృష్టమానసులె యందలియందఱు ధర్మ వేదు లే యందఱు శాస్త్రచింతనపరాయణులే మఱి స్వస్వతుష్టులే యందఱుఁ ద్యాగశీలు రట నందఱు సత్యవచోభిభాషణా మందులు భూరిసంచయు లమాస గవాశ్వ ధనాఢ్యు లందఱున్. ౨౬౫ అయోధ్యానగర వాసులందఱు నిష్టార్థములన్నియుఁ బ్రాప్తించుటచే సంతుష్టిగల మనస్సు గలవారే, అందఱు ధర్మము నెఱిగినవారే, అందఱు శాస్త్ర విషయమైన యాలోచనలు చేయుటయందు సమర్థులే, అందఱు తమకు భగవంతుఁ డిచ్చిన దానితోఁ దృప్తిపడి యుండువారే, అందఱు త్యాగము స్వభావముగా గలవారే, అందఱు నిజము చెప్పువారే, అందఱు కావలసినంత సంపాదించి యుంచుకొన్నవారే, అందఱు కొఱఁత లేక వారివారికిఁ గావలసినన్ని గోవులు - గుఱ్ఱములు - ధనములు కలవేరే. కందము. జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్ దనివిగ నిండక యుండెడి మనికి యొకండైనలేదు మందునకైనన్. ౨౫౭ ' మాతాపితాస్ను షే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్స్వయం దశసంఖ్య కుటుంబీతి విష్ణునో క్తం ద్విజోత్తమ ' యని కుటుంబ లక్షణము. తల్లి తండ్రి తాను దనభార్య, ఇద్దఱు కొడుకులు, ఇద్దఱు కోడండ్రు, ఒక కూతురు, ఒక యతిథి - యీ పదుగురుండినఁ గుటుంబ మనబడును. ఇంతకుఁ దక్కువగల యి ల్లా నగరమున లేదు.( ఇప్పటి కుటుంబాలు ముగ్గుఱు గాని నలుగుఱు గాని అంతే ) ఆటవెలది. తన్ను ధర్మవిధులఁ దనయులఁ దనయలఁ తల్లిఁ దండ్రిఁ దనదు దార నన్న దమ్ములను గదర్యతావశచిత్తుఁడై యేఁచువాఁడు లేఁడ యెచట నేని. ౨౫౮ ఈ పద్యమునఁ జెప్పఁబడిన వారిని కూడు నీళ్ళు పెట్టక కాని యితర విధములఁ గాని బాధించువాఁడు కదర్యుఁడు, వానిభావము కదర్యత, అత్యంతలోభియై యని భావము. ' ఆత్మానం ధర్మకృత్యంచ, పుత్రందారాంశ్చ పీడయేత్, లోభాద్యః పితరం బ్రాతృన్ స కదర్య ఇతి స్మృతః ' అని కదర్య లక్షణము. తాను దినక ధర్మము చేయక కొడుకులను భార్యను నెవఁడు కడుపునిండఁ గూడు పెట్టక బాధించునో యట్టి పరమ లోభి కదర్యుఁ డనబడును. అట్టివాఁ డొక్కఁ డైన నా పట్టనమందు లేఁడు. కందము. పోఁడిమి గల తత్పురమున లేఁడు ఖలుఁడు దుష్టకామి లేఁడు చదువులన్ వాఁడిమి మీఱనిపురుషుఁడు లేఁ డట నాస్తికుఁడు నెందు లేఁడు వెదకినన్. ౨౫౯ పూర్వ మన్ని జాతులవారును విద్యనేర్చినవారే యని చెప్పుచున్నాఁడు. పూర్వము శూద్రులకు విద్య నిషేధింపఁ బడినదను దుర్వాదము దీనిచే ఖండితము. శూద్రులకు వేదము నిషేధింపఁ బడినది కాని కులవృత్తికిఁ గావలసిన విద్య లోనైనవి నిషేధింపబడలేదు. అందమైన యానగరమందు దుష్టుఁడు లేఁడు, పరస్త్రీల నాశించువాఁడు, తన భార్యతోనైనను నిషిద్ధదినంబుల నిషిద్ధసమయంబు లందుఁగాని క్రీడించువాఁడును, వేశ్యాలంపటుఁడును లేఁడు. చక్కగఁ జదువరానివాఁడును లేఁడు. దేవుఁడు, పరలోకము లేదనువాఁడు లేఁడు. ఉ. అందఱు ధర్మశీలరతులందఱు నిశ్చలసంయతాత్ము లే యందఱు సత్స్వభావయుతులందఱు నిర్మలవృత్తశాలు రే యందఱు సన్మహర్షినిభు లందఱు నిర్మలమానసాఢ్యు ల య్యందఱు దారహారయుతు లందఱుఁ గుండలమండితశ్రవుల్. ౨౬౦ ఆ పురమం దందఱు ధర్మముతోఁ గూడిన శీలమందుఁ బ్రేమగలవారే, అందఱు నింద్రియనిగ్రహముగలవారే, అందఱు మంచి స్వభావముగలవారే, అందఱు దోషరహితమైన నడవడిగలవారే. అందఱు ఋషులతో సమానులే. అందఱు కలంకము లేని మనస్సుకలవారే, అందఱు ముత్యాలసరములు లోనైన యాభరణముల ధరించినవారే, అందఱు కుండలములచే నలంకరింపఁబడిన వీనులు గలవారే. ఉ. అందఱు సుందరుల్ మకుటు లందఱుఁ జందనలి ప్తదేహు లం దందఱుఁ బూర్ణభోగయుతు లందఱు సంతతమృష్టభో క్త ల య్యందఱు దానశీలరతు లందఱు భూషణభూషితాంగు ల య్యందఱు నిష్కవంతు లట నందఱు నంగదదీప్త బాహువుల్. ౨౬౧ అందఱు చక్కదనము కలవారే, కురూపులు లేరు అందఱు మకుటములు ధరించినవారే, అందఱు చందనము పూసికొనియుండువారే, అందఱు కొఱఁత లేక భోగము లనుభవించువారే, అదఱు నిష్టమై పరిశుద్ధమైన యాహారము తీసుకొనువారే, అందఱు నన్నదాతలే, అందఱు నన్ని యవయవములయందు నలంకారములు ధరించినవారే, అందఱు నురోభూషణములు గలవారే, అందఱు బాహుపురులు గలవారే. ఉ. అందఱు నిర్జితేంద్రియులు నందఱు యజ్వలు నాహితాగ్ను ల య్యంద ఱటన్ స్వకర్మరతు లందఱు నిత్యము బ్రహ్మచింతనుల్ అందఱు సంతతాధ్యయనులందఱు సంయమితుల్యు లప్పురిం జెందిన యట్టిలోకులు సుశీలరతుల్ కరుణాపరాయణుల్. ౨౬౨ ఆ పురమునందలి యందఱు నింద్రియముల జయించినవారే. అందఱు సోమయాగము చేసినవారే. అందఱు నగ్నిహోత్రములు కలవారే, అందఱు వారివారి వర్ణాశ్రమధర్మముల ననుసరించి కర్మములు చేయువారే, అందఱు ప్రతిదినము బ్రహ్మమును ధ్యానించువారే, అందఱు జపతపస్సంపన్నులే, అందఱు ఋషుల చర్యలు గలవారే్, అందఱు దయాళులే, అందఱు చక్కని నడవడి గలవారే. ఈ పద్యమునందలి పాదాంత సంధివిషయమును గుఱించి వాసుదాసుగారు చాలా విస్తృతమైన వివరణ యిచ్చారు. వారు ప్రతి పద్యానికి ప్రతిపదార్థాన్ని కూడా వ్రాసారు. |
Posted by
Unknown
0
comments
Jan 30, 2010
ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళఁ , జూపఱుల్
రామాయణ రస గుళికలు ( కీ.శే. శ్రీ వావిలికొలను సుబ్బారావు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము నుండి )
చం.
ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళఁ , జూపఱుల్
గబ గబ బైటఁ బెట్టుఁ డిఁకఁ గార్యము లే దనువేళఁ, గింకరు
ల్దబ దబఁ బ్రాణవాయువులు లాగెడివేళలఁ, నాలుఁ జుట్టముల్
లబ లబ లాడువేళలఁ దలంపఁగ శక్యమె రామనామమున్ ? 1-39
సీ.
దంతంబులూడునన్చింత పుట్టకమున్న, కనుదోయి మసకలు గొనకమున్న
ముడుతలచే మేను మిడుకులాడకమున్న, వడఁకునఁ గాల్దడఁ బడకమున్న
పెండ్లము కడుఁ గడగండ్లు పెట్టకమున్న, నందను ల్దనుఁ జూచి నగకమున్న
గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న, చెడురోగములఁ దెల్వి చెడకమున్న
గీ.
పూని వైద్యుండు చెప్పక పోకమున్న
కాలభటదర్శనంబును గాకమున్న
రామ శ్రీరామ శ్రీరామ రామ యనుచు
ధ్యాన మొనరించు వాఁడెపో ధన్యతముఁడు. 1-40
సీ.
భవ్య మై మౌని సంభావ్య మై సుజనాను, భావ్య మై నవరస భావ్య మగుచు
హృద్య మై భక్తి సంవేద్య మై కావ్యాళి, నాద్య మై సతతానవద్య మగుచు
శుద్ధ మై పద్య నిబద్ధ మై శాస్త్ర సంబద్ధ మై నిగమార్థ సిద్ధ మగుచుఁ
బూత మై కలిత సంగీత మై మౌని రాడ్జాత మై ధర్మ నికేత మగుచు
తే.
శ్రావ్య మై సర్వలోక సంస్తవ్య మగుచు, దివ్య మై పార్వతీశాజ సేవ్య మగుచు
నవ్య మై గుణమణిగణ, దీవ్యదర్థమయిన కావ్యంబు రచియింతు నాంధ్రభాష. 1-78
బాలకాండకు ఉపోద్ఘాతం లో వ్రాసిన పద్య రస గుళికలు
Posted by
Unknown
0
comments
Subscribe to:
Posts (Atom)